29, ఫిబ్రవరి 2012, బుధవారం

మనసు ఇచ్చే విరామం .......

ఆలోచనలు చేయలేని మనసు, ఆనందం వెతుక్కోవడం కోసం ప్రతీ క్షణం ఎదురుతెన్నులు చూసే మనసు...ఒక చిన్న మాటకే తుళ్ళింతలతో కృష్ణనదిలా పరుగులిడే మనసు....అందాల హరివిల్లుకు ధీటైన మనసు ఒక్కోసారి ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోతుంది....అపుడు ఎవరు మనల్ని పలకరించిన చెప్పే జవాబు ఒకటే మనసు బాగాలేదు ఈ పదం ఎపుడో ఒకప్పుడు అందరూ చెప్పేదే..

మనసుకు నచ్చని పని చేయడం తప్పని సరి అయినపుడు, మనసు ని బుజ్జగించడం మొదలెడతాం మన మెదడులోని ఆలోచనా శక్తితో, మనసు తనకు కావాల్సింది వదులుకోక తప్పదని తెలిసినపుడు తను కోల్పోయే ఆనందం భర్తీ ఎక్కడ ఎలా చేయాలి అని, తనని తాను కోల్పోకుండా ఉండడానికి ఇచ్చే చిన్న విరామమే....ఈ నిశ్శబ్దం

చిన్నపిల్లాడు తనవద్ద ఉన్నఎర్ర రంగు బంతి పోగొట్టుకొని వేరే రంగు బంతి తో  లేదా అమ్మ ఇచ్చే చాక్లెట్ తో భర్తీ చేసినపుడు మనసులోని నిశ్శబ్దం గుర్తించలేనంత తక్కువ నిడివి కలిగి ఉంటుంది , ఒక తల్లి తన పిల్లాడు తప్పు చేస్తే మన్నించి  అక్కున చేర్చుకోడానికి మధ్య మనసు యొక్క నిశ్శబ్దం నిడివి తక్కువ,  ..కానీ  అన్ని సమయాల్లో అది సాధ్యం కాదు . ఏది ఏమైనప్పటికి మనసులోని నిశ్శబ్దం నిడివి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఈ నిడివి పెరిగే కొద్ది మనం అందుకునే ఆనందం ఎంత ఎక్కువ ఉంటుందో తెలియదు కానీ మనతో ఉండే పరిసరాలలో మనుషుల్లో పెను మార్పు కలగడం మాత్రం ఖాయం.

కొన్ని ఆకారణ ద్వేష భావాల వల్ల నిశ్శబ్ద నిడివి ఊహించలేనంత ఎక్కువగా ఉంటుంది ,అపుడు   ఈ మనసులో నిశ్శబ్దం మనిషిని కృంగదీస్తుంది.ఆప్తులని దూరం చేస్తుంది. ఇలాంటివి మనిషి జీవితంలో ఎపుడో ఒకప్పుడు ఎదురై ఇబ్బంది పెట్టొచ్చు..కానీ ఇలాంటివి  జీవితం మొత్తంలో అతి తక్కువ భాగస్వామ్యం ఉంటుంది.

మార్పు తప్పనిసరి ఇనపుడు, పదే పదే జరగనివి తలచుకోకుండా వీలయినంత త్వరగా వాటినన్నిటిని ఒక జ్ఞాపకంగా మార్చుకో....గోదావరి నది లాంటి నిశ్శబ్దాన్ని జ్ఞాపకాల భరిణలో దాచి కృష్ణవేణి నదిలా తుళ్ళింతలతో  సాగిపో... అది నీవు జీవితానికి అందించి అపురూపమైన కానుక.....